Narendra Modi: ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... కాసేపట్లో కీలక ప్రకటన?

- జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి
- అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- మోదీ నివాసంలో కీలక సమావేశం
- భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో, దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశమైంది. లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ భేటీకి అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్ ప్రీత్ సింగ్లు కూడా హాజరై తాజా భద్రతా పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్మూకశ్మీర్లోని భద్రతా పరిస్థితులు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, పహల్గాం దాడికి సంబంధించి భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, భద్రతాపరమైన అంశాలపై కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కాగా, ఈ సీసీఎస్ సమావేశానికి ముందే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పహల్గాం దాడికి పాల్పడిన వారిని ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేసిన విషయం గమనార్హం. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.
