Pallavi: కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. భర్తను చంపేందుకు గూగుల్లో వెతికిన పల్లవి

- మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో భార్య పల్లవి అరెస్ట్
- మెడ నరాలు కోసి చంపడంపై గూగుల్లో వెతికిన పల్లవి
- హత్యకు ముందు ఐదు రోజుల పాటు ఇలాంటి సమాచారం వెతుకుతున్నట్లు చూపిన సెర్చ్ హిస్టరీ
- గృహ హింస వల్లే హత్య చేశానని పల్లవి ఆరోపణలు
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన భార్య పల్లవి (64), భర్తను హత్య చేయడానికి ముందు కొన్ని రోజులపాటు హత్య చేసే మార్గాల గురించి ఇంటర్నెట్లో అన్వేషించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదివారం రాత్రి బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని వారి నివాసంలో ఓం ప్రకాశ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి పల్లవిని సోమవారం అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, పల్లవి ఫోన్ను పరిశీలించగా మెడ వద్ద నరాలు, రక్తనాళాలు కోయడం ద్వారా ఒక వ్యక్తిని ఎలా చంపవచ్చనే దానిపై ఆమె గూగుల్లో వెతికినట్లు తెలిసింది. గత ఐదు రోజులుగా ఆమె ఇలాంటి సమాచారం కోసమే అన్వేషిస్తున్నట్లు సెర్చ్ హిస్టరీ ద్వారా తెలుస్తోందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. హత్యకు ముందు ఓం ప్రకాశ్ ముఖంపై పల్లవి కారం చల్లి, ఆ తర్వాత కత్తితో పలుమార్లు పొడిచి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
మరోవైపు, పల్లవి గత కొంతకాలంగా స్కిజోఫ్రెనియా వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్లు కూడా సమాచారం. అయితే, భర్త తనను గృహ హింసకు గురిచేసేవాడని, అందుకే ఈ దారుణానికి పాల్పడ్డానని ఆమె ఆరోపిస్తున్నారు. కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, 'గృహ హింస' అంటూ పలుమార్లు వ్యాఖ్యానించారు.