Rajiv Menon: 'బొంబాయి' లాంటి సినిమా ఇప్పుడు విడుదలైతే ఎన్ని థియేటర్లు తగలబడతాయో చెప్పలేం: రాజీవ్ మేనన్

- ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి సినిమా తీయడం సాధ్యమయ్యే పని కాదని వ్యాఖ్య
- ఆనాడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్న రాజీవ్ మేనన్
- గడిచిన పాతికేళ్లలో ప్రజల్లో సహనం చాలా తగ్గిపోయిందని వ్యాఖ్య
'బొంబాయి' వంటి చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో విడుదలైతే దేశవ్యాప్తంగా ఎన్ని థియేటర్లు దగ్ధమయ్యేవోనని ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన రాజీవ్ మేనన్ అభిప్రాయపడ్డారు. ఈ కాలంలో అలాంటి సినిమాను రూపొందించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, మతం అనేది అతిపెద్ద సమస్యగా మారుతోందని వ్యాఖ్యానించారు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు.
'బొంబాయి' లాంటి సినిమాను ఇప్పుడు నిర్మించి విడుదల చేస్తే, ఎన్ని థియేటర్లు తగలబడతాయో అంచనా వేయలేమని అన్నారు. గత పాతిక, ముప్పై ఏళ్లలో ప్రజల్లో సహనం బాగా తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రల్లో నటించిన 'బొంబాయి' చిత్రం 1995లో విడుదలై గొప్ప విజయాన్ని అందుకుంది.