Arvind Kejriwal: ఢిల్లీ కోర్టు ఆదేశాలతో కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు

ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పోలీసు కేసు నమోదయింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే అభియోగాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా పెద్ద హోర్డింగ్ లు ఏర్పాటు చేయడానికి నిధులను దుర్వినియోగం చేశారంటూ కేజ్రీవాల్, ఇతరులపై ఆరోపణలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో వీరిపై కేసులు నమోదు చేయాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 11న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసినట్టు కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్టు నివేదికలో పేర్కొన్నారు. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.

2019లో అప్పటి మటియాలా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, ద్వారక ఏ వార్డు మాజీ కౌన్సిల్ నితికా శర్మ భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. దీంతో, వీరు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ నిధులను నిర్వీర్యం చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.   
Arvind Kejriwal
Delhi Court
FIR
Misuse of Funds
AAP
Gulab Singh
Nitika Sharma
Hoardings
Corruption
Delhi Politics

More Telugu News