యెమెన్లో అమెరికా దాడులు.. 24 మంది మృతి.. హౌతీలకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
- హౌతీల సమయం అయిపోయిందని ట్రంప్ హెచ్చరిక
- హౌతీలకు మద్దతు ఆపాలని ఇరాన్ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు
- హౌతీలు దాడులు ఆపకుంటే నరకం చూస్తారని ట్రంప్ హెచ్చరిక
హౌతీలు బలంగా ఉన్న యెమెన్ రాజధాని సానాలో అమెరికా జరిపిన దాడుల్లో 13 మంది పౌరులు, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. అమెరికా బాంబు దాడులతో సానా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో అందరూ భూకంపం వచ్చిందని భ్రమపడ్డారు.
ట్రంప్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని హౌతీ పొలిటికల్ బ్యూరో ఆరోపించింది. ఈ దాడులకు సమాధానం చెప్పేందుకు యెమెన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. గత దశాబ్దంలో యెమెన్లోని ఎక్కువ భూభాగాన్ని హౌతీలు తమ అధీనంలోకి తీసుకున్నారు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత దాని తీరంలోని ఓడలపై హౌతీలు దాడులు ప్రారంభించారు. ఇది ప్రపంచ వాణిజ్యానికి ఆటంకంగా మారింది. గాజాలో యుద్ధంపై పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఈ దాడులు జరుపుతున్నట్టు హౌతీలు చెబుతున్నారు. కాగా, 2023 నుంచి హౌతీలు 174 సార్లు అమెరికా యుద్ధ నౌకలపై, 145 సార్లు వాణిజ్య నౌకలపై దాడిచేసినట్టు సమాచారం.