Samantha: ఆ సినిమాలో చేసిన ప్రతి సీన్ గుర్తుంది: సమంత

- ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత
- తాజాగా హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు స్వీకరణ
- తొలి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న సమంత
'ఏ మాయ చేసావే' మూవీతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న సమంత .. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్తో పాటు నటిగా కూడా పేరు తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు వచ్చాయి. తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోలందరితో నటించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును సమంత తాజాగా అందుకుంది.
ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో సమంతకు ఈ అవార్డు బహూకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తొలి చిత్రం ఏ మాయ చేశావే గురించి ఆసక్తికర విషయాలను ఆమె పంచుకుంది. అక్కినేని నాగ చైతన్య తో ఏ మాయ చేసావే సినిమాతో సమంత సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.
ఈ ఇంటర్వ్యూలో తన తొలి చిత్రం గురించి సమంత మాట్లాడుతూ.. ఆ మూవీలోని ప్రతి షాట్ తన జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పింది. ఈ మూవీలో జెస్సీ పాత్రలో కార్తీక్ను గేట్ దగ్గర కలిసే సీనే తన ఫస్ట్ షాట్ అని, అది తనకు జీవితాంతం గుర్తిండిపోతుందని అన్నారు. గౌతమ్ మీనన్ ఆ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారని, ఆయనతో పని చేయడం మంచి అనుభూతినిచ్చిందని సమంత తెలిపింది.
అయితే, ఈ 15 ఏళ్లలో తనకు మార్గనిర్దేశం చేసేవారు లేకపోవడంతో కొన్ని మంచి సినిమాలు చేయలేకపోయానని వెల్లడించింది. సమంత 2010లో రాహుల్ రవీంద్రన్తో మాస్కోయిన్ కావేరీలో నటించింది. అయితే ఈ మూవీ ఏ మాయ చేశావే కంటే ముందే చిత్రీకరణ జరిగినప్పటికీ విడుదల కాలేదు.
సమంత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం, మహేశ్ బాబుతో దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ తో అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాంటి ప్రాజెక్టు చేయడం లేదు. తెలుగులో చివరి సారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది. గత ఏడాది వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో సమంత నటించింది.