Odisha: ఒడిశా బీచ్ కు ప్రత్యేక అతిథులు... వీడియో ఇదిగో!

ఒడిశాలోని గహీర్ మఠ తీరంలో ఏటా వచ్చే ప్రత్యేక అతిథులతో కిటకిటలాడుతోంది. తీరం వెంబడి ఎటుచూసినా ఆలివ్ రిడ్లే తాబేళ్లు కనిపిస్తున్నాయి. గుడ్లు పెట్టే సీజన్ కావడంతో లక్షలాదిగా తాబేళ్లు ఇక్కడికి చేరుకుంటున్నాయి. గడిచిన 12 రోజుల్లో దాదాపు 7 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లు గహీర్ మఠ తీరానికి చేరుకున్నాయని భారత మత్స్య పరిశోధన సంస్థ(ఎఫ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్‌ తెలిపారు. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల నుంచి ఇవి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఏటా ఈ తీరానికి వస్తాయని వివరించారు.

గహీర్ మఠ తీరం సురక్షితమని భావించి ఇక్కడికి ఏటా వస్తాయన్నారు. వెన్నెల రాత్రుల్లో ఇవి తీరంలో గుడ్లు పెడతాయని చెప్పారు. ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెడుతుందని తెలిపారు. 

కాగా, ఏటా ఈ సీజన్ లో వచ్చే ఈ ప్రత్యేక అతిథుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. తీరంలో చేపల వేటను నిషేధించడంతో పాటు పర్యాటకులను నియంత్రిస్తున్నట్లు వివరించారు. తీరంలో తాబేళ్లు పెట్టే గుడ్లను పరిరక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Odisha
Beach
Turtles
Olive Ridley
Turtle Nesting

More Telugu News