పవన్ కల్యాణ్‌ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్

  • మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ ను కలిసిన వీహెచ్
  • కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని విజ్ఞప్తి
  • ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని పవన్ కల్యాణ్ హామీ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని ఈ సందర్భంగా వీహెచ్ విజ్ఞప్తి చేశారు.

దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని ఈ సందర్భంగా వీహెచ్ గుర్తు చేశారు. సామాజిక పెన్షన్లు రావడంలో, కార్మికులకు వివిధ రకాల ప్రయోజనాలు కల్పించడంలో సంజీవయ్య పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించాలని కోరారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని వీహెచ్ కు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

ఈ భేటీ సందర్భంగా పవన్ కల్యాణ్... వీహెచ్‌కు శాలువాను కప్పి సత్కరించారు. వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు. వీహెచ్ చేతిలో నుంచి విజ్ఞాపన పత్రాన్ని తీసుకొని చదివారు. 

Pawan Kalyan
VH
Chandrababu
Andhra Pradesh
Telangana

More Telugu News