Infosys: ఇన్ఫోసిస్‌లో ఒకే రోజు 400 మందికిపైగా ట్రైనీ ఉద్యోగుల తొలగింపు

Infosys terminates over 400 employess
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఒకే రోజు 400 మందికిపైగా ట్రైనీ ఉద్యోగులను తొలగించడంపై కేంద్ర కార్మికశాఖ తీవ్రంగా స్పందించింది. ఇటీవల ఉద్యోగులందరినీ ఒకేసారి తొలగించిన ఇన్ఫోసిస్.. సెక్యూరిటీ సిబ్బందితో వారిని బయటకు పంపించి వేసింది. దీంతో బాధిత ఉద్యోగులు, ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఎన్ఐటీఈఎస్‌) కలిసి కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు.

తాజాగా స్పందించిన కేంద్ర కార్మిక శాఖ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉద్యోగులను ఇన్ఫోసిస్ సామూహికంగా తొలగించడంపై జోక్యం చేసుకోవాలని కోరింది. 

రాత్రివేళ బయటకు పంపితే ఎక్కడకు వెళ్లాలని, ఈ ఒక్క రాత్రి హాస్టల్‌లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి బతిమాలినా కంపెనీ నిరాకరించింది. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు రాత్రంతా క్యాంపస్ బయట రోడ్డుపైనే గడిపారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అయ్యాయి. 

మరోవైపు, ఉద్యోగుల తొలగింపును ఇన్ఫోసిస్ సమర్థించుకుంది. సంస్థలో నియామక ప్రక్రియ కఠినంగా ఉంటుందని, మైసూర్ క్యాంపస్‌లో ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత ఇంటర్నల్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొంది. వారికి మూడు అవకాశాలు ఉంటాయని, అప్పుడు కూడా ఉత్తీర్ణత సాధించకుంటే సంస్థలో పనిచేసే అవకాశం ఉండదని తెలిపింది. ఈ విషయమై వారితో ముందుగానే ఒప్పందం చేసుకుంటామని వివరించింది. 
Go Back to Shorts
Infosys
IT Employees
Infosys Mysore Campus

More Telugu News