Peddireddi Ramachandra Reddy: జగన్ ప్రజల్లోకి వస్తారు... పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క వైసీపీ నేత, కార్యకర్త కృషి చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అన్ని వర్గాలతో కలిసి ముందుకు సాగాలని చెప్పారు. పార్టీ గురించి భయపడాల్సిన అవసరం లేదని... ప్రతిపక్షంలో ఉన్నామని నిరాశ చెందవద్దని... మనకు 46 శాతం ఓటింగ్ వచ్చిందని అన్నారు. త్వరలోనే జగన్ ప్రజల్లోకి వస్తారని చెప్పారు. 

ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి సూచించారు. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత జగన్ దని చెప్పారు. కోవిడ్ సమయంలో రెండేళ్ల పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ... ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు. కరోనా సమయంలో చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. 

ఏ ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెద్దిరెడ్డి చెప్పారు. ప్రజల తరపున పోరాటం చేయాలని... జగన్ ను మళ్లీ సీఎంను చేసుకోవాలని అన్నారు.
Peddireddi Ramachandra Reddy
YSRCP
Jagan
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News