Nirmala Sitharaman: బడ్జెట్ బాగుంది... అందరూ ప్రశంసిస్తున్నారు: నిర్మలా సీతారామన్‌తో ప్రధాని మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం అనంతరం నిర్మల సీతారామన్‌తో ప్రధానమంత్రి మోదీ ఈ మేరకు మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ బడ్జెట్‌పై దాదాపు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారని నిర్మలా సీతారామన్‌ను మోదీ అభినందించారు.

బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంవత్సరానికి రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్ర బడ్జెట్‌లో వెసులుబాటు కల్పించిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.

ప్రతిపాదిత పన్ను మినహాయింపు ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రయోజనం పొందిన లబ్ధిదారులందరికీ అమిత్ షా అభినందనలు తెలియజేశారు.

ఈ బడ్జెట్ స్వావలంబన కోసం రూపొందించబడిందని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ బడ్జెట్‌లో రైతులు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులు రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చని ఆయన వెల్లడించారు.
Nirmala Sitharaman
Narendra Modi
Union Budget
BJP

More Telugu News