తాము ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైంది: కేసీఆర్

KCR comments on Congress govt
  • చాన్నాళ్ల తర్వాత గొంతుక వినిపించిన కేసీఆర్
  • తమకు కూడా తిట్టడం వచ్చన్న బీఆర్ఎస్ చీఫ్
  • మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చాన్నాళ్ల తర్వాత తన గొంతుక వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైనశైలిలో ధ్వజమెత్తారు. ఇవాళ సిద్ధిపేటలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు జరిగాయి. 

పలువురు నేతలకు పార్టీలోకి స్వాగతం పలికిన కేసీఆర్... ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాము ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచాయని, ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలని స్పష్టం చేశారు. 

మాకు కూడా తిట్టడం వచ్చు... రౌడీ పంచాయితీలు చేయడం మాకు కూడా తెలుసు...  అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదు... ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది సేవ చేయడానికి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

"మేం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90 శాతం ఎక్కువ హామీలు అడగకుండానే అమలు చేశాం. చేయలేనివి కూడా చేస్తామని చెప్పడం మాకు రాదు, తెలియదు. మాకు మాట్లాడడం రాదనుకున్నారా... ఇవాళ మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా.

ప్రజలను కాపాడాల్సింది పోయి భయపెడతారా? అధికారంలోకి రాగానే వాడ్ని లోపలెయ్యాలి, వీడ్ని లోపలెయ్యాలి అని ఆలోచిస్తారా?  అరెస్టులకు భయపడేది లేదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది బాధ్యతాయుతంగా ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు... నిర్మించడానికి. 

బీఆర్ఎస్ శ్రేణులు కంగారు పడాల్సిన పనిలేదు.... మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. ట్రెండ్ చూస్తే... ప్రజలు బీఆర్ఎస్ పై విశ్వాసంతో ఉన్నారన్న విషయం అర్థమవుతోంది" అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Advertisement
KCR
BRS
Congress
Telangana

More Telugu News