India vs Bangladesh: కాన్పూర్ టెస్ట్... వర్షం కారణంగా త్వరగా ముగిసిన తొలి రోజు ఆట

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా 35 ఓవర్లు మాత్రమే మ్యాచ్ కొనసాగింది. ఆట మధ్యలో వర్షం పలుమార్లు అంతరాయాలు కలిగించింది. ఆ తర్వాత ఎడతెరిపిలేకుండా పడుతుండడం, మైదానం చిత్తడిగా మారడంతో  తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు 3 గంటల సమయంలో అంపైర్లు ప్రకటించారు. 

తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులుగా ఉంది. క్రీజులో మోమీనుల్ హక్ 40, ముష్ఫీకర్ రహీం 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో టాస్ కూడా ఆలస్యంగానే వేశారు. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పర్యాటక జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా ఆదిలోనే రెండు కీలక వికెట్లు నష్టపోయింది.

భారత పేసర్ ఆకాశ్ దీప్ చెలరేగడంతో బంగ్లా జట్టు స్కోరు 26 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. తొలుత ఓపెనర్ జకీర్ హసన్‌ (0)ను ఔట్ చేసిన ఆకాశ్ దీప్... ఆ వెంటనే 29 పరుగుల వద్ద రెండవ వికెట్‌గా షద్మాన్ ఇస్లామ్‌ను (24) ఔట్ చేశాడు. దీంతో భారత్‌కు శుభారంభం లభించినట్టయింది. 

ఇక బంగ్లాదేశ్ స్కోర్ 80 పరుగుల వద్ద డేంజరస్ బ్యాటర్, కెప్టెన్ శాంటోను (31) అశ్విన్ ఔట్ చేశాడు. బంగ్లాదేశ్ 80 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.
India vs Bangladesh
Kanpur Test
Cricket
Team India
Bangladesh

More Telugu News