బుడమేరుకు పెరుగుతున్న వరద.. విజయవాడ వీధుల్లోకి నీళ్లు

  • గురువారం తెల్లవారుజామున భారీ వర్షం
  • బెజవాడకు మరోసారి వరద ముప్పు
  • ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న జనం
బెజవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని జనం ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు. బుడమేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడడంతో విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇటీవలి వర్షాలకు ఇప్పటికే బెజవాడను వరద ముంచెత్తింది. క్రమంగా కాలనీల్లో చేరిన నీరు తగ్గుతోంది.

అయితే తాజాగా కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీల్లోకి మరోమారు వరద వచ్చి చేరుతోంది. మరోవైపు, బుడమేరు వాగుకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు. గత నాలుగు రోజుల పాటు తిండి, నీరు లేక అవస్థ పడిన జనం.. మరోసారి ఆ కష్టాలను ఎదుర్కోలేమని ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు.

Vijayawada
Floods
Budameru
People vacating

More Telugu News