మహంకాళీ బోనాల జాతరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

Mahankali priests invited CM Revanth Reddy to Bonalu
  • సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన ఆలయ అర్చకులు
  • సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన అర్చకులు
  • కార్యక్రమంలో ఎంపీ అనిల్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
సికింద్రాబాద్ మహంకాళీ బోనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ అర్చకులు ఆహ్వానించారు. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రిని అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బోనాల జాతరకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. 

ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయాలి

రానున్న మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌తో సమాంతరంగా సెమీరెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్లే స్కూల్ తరహాలో మూడో తరగతి వరకు అంగ‌న్వాడీ కేంద్రాలలో విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలన్నారు.

అంగన్వాడీలలో విద్యాబోధనకు అదనంగా ఒక టీచర్‌ను నియమించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకునేలా ఉండాలన్నారు. గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలన్నారు.

విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకటిరెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్ర‌ణాళిక‌లు త‌యారు చేయాల‌ని ఆదేశించారు. ప్రభుత్వ నిధులతోపాటు సీఎస్ఆర్ ఫండ్స్‌తో విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
Advertisement
Revanth Reddy
Congress
Bonalu

More Telugu News