చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం.. డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్!

చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం.. డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్!

Deputy Surveyor Suspended for Demanding Bribery for CM Chandrababu Land
  • శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలం కొనుగోలు చేసిన బాబు
  • ఇంటి నిర్మాణం కోసం వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడికి టీడీపీ నేత‌ల‌ దరఖాస్తు
  • స్థలం సబ్ డివిజన్ కోసం డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సేన్ రూ. 1.80 లక్షల డిమాండ్‌
  • ఆ మొత్తం ఇవ్వ‌డంతో ముందుకు క‌దిలిన ప‌నులు
  • తాజాగా విచారణ జరిపి చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు
చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్‌ లంచం తీసుకున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొన్నారు. ఆ స్థలం జాతీయ రహదారి పక్కనే ఉంది. 

అయితే, చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలం వ్యవసాయ భూమి కావడంతో.. గృహ నిర్మాణం చేసేందుకు కుప్పం టీడీపీ నేతలు భూ వినియోగంగా మార్చి.. ఈ స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేయాలని దరఖాస్తును సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో అందజేశారు. అయితే, డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సేన్ రూ. 1.80 లక్షల లంచం ఇవ్వాల‌ని కోరారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ లంచం మొత్తం అందించడంతోనే ఆ పనులు ముందుకు కదిలాయి.

గత నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్ అండ్‌ బీ అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు రాగా.. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఆరా తీశారు. దాంతో ఈ లంచం బాగోతం వెలుగులోకి వ‌చ్చింది.

సర్వే శాఖ ఏడీ గౌస్‌ బాషాతో శాఖాపరమైన విచారణ చేయించ‌డంతో లంచం తీసుకున్న మాట నిజమే అని తేలింది. తన భూమి సర్వే కోసం సద్దాం హుస్సేన్ రూ. లక్ష డిమాండ్‌ చేసినట్టు గత నెలలో శాంతిపురానికి చెందిన ఓ రైతు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై విచారణ జరిపి.. అది కూడా నిజమే అని అధికారులు తేల్చారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ ఏడీని ఆదేశించారు. దాంతో డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సేన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువ‌డ్డాయి.
Advertisement
CM Chandrababu
Andhra Pradesh
Deputy Surveyor
Bribery

More Telugu News