‘చెంపదెబ్బ ఘటన’పై భావోద్వేగ నోట్ రిలీజ్ చేసిన కంగనా రనౌత్

BJP MP Kangana Ranaut has penned a lengthy note on slap controversy
బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌ ను ఇటీవల సీఐఎస్ఎఫ్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ చంఢీగఢ్ ఎయిర్‌పోర్టులో చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కంగనా శనివారం భావోద్వేగ నోట్‌ను విడుదల చేశారు.

‘‘ప్రతి రేపిస్ట్, హంతకుడు లేదా దొంగ.. ఇలా ఎవరైనా నేరం చేయడానికి బలమైన భావోద్వేగ, శారీరక, మానసిక లేదా ఆర్థిక కారణాలు ఉంటాయి. కారణం లేకుండా ఏ నేరం జరగదు. అయితే నేరానికి పాల్పడినవారు దోషులుగా నిర్ధారణ జరిగి శిక్షను ఎదుర్కుంటారు. బలమైన భావోద్వేగ ప్రేరణతో నేరాలకు పాల్పడేవారితో మీరు జతకడితే దేశానికి సంబంధించిన ఎలాంటి చట్టాలనైనా మీరు అతిక్రమిస్తారు. 

అనుమతి లేకుండా ఇతరుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అనుమతి లేకుండా వారి శరీరాలను తాకడం, దాడికి పాల్పడడం మీకు సబబే అనిపిస్తే అత్యాచారం, హత్యలను కూడా మీరు సమర్థిస్తున్నట్టే. మీ మానసిక, నేరపూరిత ఆలోచనలను లోతుగా పరిశీలించుకోవాలి. దయచేసి యోగా, ధ్యానం చేయాలని నేను సూచిస్తున్నాను. లేదంటే మీ జీవితం ఒక చేదు, భారంగా మారిపోతుంది. ఎక్కువ పగ, ద్వేషం, అసూయతో ఉండకండి. దయచేసి స్వేచ్ఛగా ఉండండి’’ అంటూ కంగనా రనౌత్ పేర్కొన్నారు.

కాగా రెండు రోజులక్రితం కంగనా రనౌత్‌పై చంఢీగఢ్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్‌కు చెందిన కుల్విందర్ కౌర్‌ అనే మహిళా కానిస్టేబుల్ దాడి చేసింది. ఎన్డీయే కూటమి మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఎయిర్‌పోర్టులో కంగనాకు ఈ ఘటన ఎదురైంది. దీంతో ఢిల్లీ వెళ్లిన తర్వాత సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులకు కంగన ఫిర్యాదు చేసింది. ఇదిలాఉండగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం పట్ల కంగన అవమానకరంగా మాట్లాడడంతోనే తాను దాడి చేసినట్టు నిందితురాలు పేర్కొన్నట్టు సమాచారం. రైతుల ఉద్యమంలో తన తల్లి కూడా పాల్గొందని, కంగన అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా కుల్విందర్ కౌర్‌పై కేసు నమోదవగా విచారణ జరుగుతోంది.
Go Back to Shorts
Kangana Ranaut
BJP
slap controversy

More Telugu News