జూన్ 4 తర్వాత బీజేపీ నాయకులు జైలుకెళతారు: ఆప్
- ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణంలో జైలుకు వెళ్తారని ఆరోపించిన ఆప్ సీనియర్ అతిశీ
- ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు సైతం జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందన్న ఢిల్లీ మంత్రి
- ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అతిశీ
బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని అతిశీ వ్యాఖ్యానించారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, కోట్లాది రూపాయల ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణం బయటపడుతుందని అన్నారు. ‘‘మీ అంతం దగ్గర పడింది. ఈ విషయం బీజేపీకి స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం దేశ ప్రజలు వారి మనస్సును మార్చుకున్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంపై అతిశీ స్పందిస్తూ.. హైకోర్టుపై తమకు గౌరవం ఉందని, అయితే కోర్టు నిర్ణయంతో విభేదిస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు. ఎందుకంటే మద్యం కుంభకోణం అంతా బీజేపీ రాజకీయ కుట్ర అని, ఎన్నికల బరిలో ఆప్ని ఓడించలేక ఈడీ, సీబీఐలను బీజేపీ ఉపయోగించిందని ఆమె ఆరోపించారు.