కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు దిక్కుమాలిన ప్రచారం: పాత నోటీసును ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి
- కేసీఆర్ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ఎద్దేవా
- మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్లో, ఈరోజు ఓయూ విషయంలో తప్పుడు ప్రచారమని ఆగ్రహం
- 2023 మే నెలలోనూ విద్యుత్, నీటి కొరత గురించి ప్రస్తావించారని పేర్కొన్న రేవంత్ రెడ్డి
కేసీఆర్ ట్వీట్పై సీఎం రేవంత్ రెడ్డి అదే ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. 'కేసీఆర్ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని... మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్లో, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారని పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు కూడా అలాంటి నోటీసునే జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గత ఏడాది యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు సెలవులు జారీ చేస్తూ ఇచ్చిన నోటీసును అటాచ్ చేశారు. అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు.