జగన్ పాలనలో మొదటి బాధితులు వీళ్లే: నారా లోకేశ్

Nara Lokesh held meetings with construction workers and bike mechanics
  • ఇసుక ముఠా కార్మికులు, బైక్ మెకానిక్ లతో లోకేశ్ భేటీలు
  • తాము గెలిచాక పాత ఇసుక విధానం తెస్తామని హామీ
  • బైక్ మెకానిక్ లకు సబ్సిడీ రుణాలు, చంద్రన్న బీమా అందిస్తామని భరోసా 
మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, ప్రాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన ఇసుక ముఠా కార్మికులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణరంగం కార్మికులేనని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ఇసుక విధానం తీసుకువచ్చి, నిర్మాణరంగానికి గత వైభవం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. 

"జగన్ పాలనలో ఇసుక అందుబాటులో లేకుండా చేయడం, అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల్లేక వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గతంలో కార్మిక బోర్డు ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాం. నేడు జగన్ పాలనలో కార్మిక బోర్డు నిధులు రూ.2,500 కోట్లు పక్కదారి పట్టించారు. అధికారంలోకి వచ్చాక కార్మిక సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేయడంతో పాటు చంద్రన్న బీమా పథకం, పనిముట్లు అందజేస్తాం. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటుచేస్తాం.

మెకానిక్ లకు సబ్సిడీ రుణాలు, చంద్రన్న బీమా అందిస్తాం

గత ఎన్నికలపుడు మంగళగిరిలో నేను గెలిస్తే ఆటోనగర్ తొలగిస్తానని దుష్ప్రచారం చేశారు, నేడు ఆటోనగర్ ను కబ్జాచేసేందుకు జీవోలు తెచ్చిన పార్టీ వైసీపీ అని నారా లోకేశ్ మండిపడ్డారు. ఇవాళ ఉండవల్లిలోని నివాసంలో టూ వీలర్ అసోసియేషన్ ప్రతినిధులు, బైక్ మెకానిక్ లతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... "నేడు అనేక కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. బీఎస్ 5, బీఎస్ 6, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా బైక్ మెకానిక్స్ కి శిక్షణ ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా లేదా పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని బైక్ రిపేర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అధునాతన పనిముట్లు అందిస్తాం. మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తాం. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక బైక్ మెకానిక్స్ కి ప్రభుత్వ గుర్తింపు కార్డులు, వైద్యసౌకర్యం, చంద్రన్న బీమా అమలు చేస్తాం. ఆటోనగర్ లో మెరుగైన వసతులు కల్పిస్తాం. టూ వీలర్ మెకానిక్ లను అన్ని విధాల ఆదుకుంటాం" అని లోకేశ్ భరోసానిచ్చారు.
Go Back to Shorts
Nara Lokesh
Construction Workers
Bike Mechanics
Undavalli
Mangalagiri
TDP

More Telugu News