కీలక నిర్ణయం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు!

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగు వేస్తోంది. రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. శుక్రవారం పౌర సమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలో ఈ రెండు కమిషన్లను ప్రకటిస్తామన్నారు.

మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేస్తామని, పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు.

పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నామన్నారు. కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయమని, రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామన్నారు.

Revanth Reddy
Telangana
Congress

More Telugu News