గ్రూప్ 1 నోటిఫికేషన్‌ ఇంకా రాలేదేం?: కిషన్ రెడ్డి మండిపాటు

ConGress Failed Promise says Kishan Reddy
  • హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందంటూ ట్వీట్
  • ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటనలు ఇచ్చిందన్న కిషన్ రెడ్డి
  • నమ్మి ఓటు వేసిన యువతను కాంగ్రెస్ నిండా ముంచిందని ఆరోపణ
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతను మరోసారి మోసం చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయిందంటూ ట్వీట్ చేశారు. ప్రజలను మభ్యపెట్టడంలో కాంగ్రెస్‌కు ఘన చరిత్ర ఉందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు... 25 నవంబర్ 2023 రోజున కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వార్తా పత్రికలలో ప్రకటన ఇచ్చిందని... 1 ఫిబ్రవరి 2024 నాటికి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. ఈ రోజు ఫిబ్రవరి 2వ తేదీ అని గుర్తు చేశారు.

ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన మిగతా హామీలను తాము తప్పకుండా అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిందని... కానీ ఇప్పుడు హామీల దిశగా ఎలాంటి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. ఫిబ్రవరి నెల వచ్చినప్పటికీ నోటిఫికేషన్ రాలేదన్నారు. నమ్మి ఓటు వేసిన యువతను కాంగ్రెస్ నిండా ముంచిందని ఆరోపించారు. ఇతర హామీలను కూడా దాటవేసే ప్రయత్నం చేస్తోందన్నారు.
Go Back to Shorts
Kishan Reddy
BJP
Congress
Telangana

More Telugu News