Tony De Zorzi Century: రెండో వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. టోనీ డి జోర్జి అజేయ సెంచరీతో చెలరేగడంతో 212 పరుగుల లక్ష్యాన్ని 42.3 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు ఛేదించింది. దీంతో భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో డి జోర్జి(119 నాటౌట్), రీజా హెండ్రిక్స్(52) కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 130 పరుగులు జోడించారు. మిగతా బ్యాటర్లలో డస్సెన్ (36), మార్ర్కమ్ (2 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా సునాయసంగా విజయ తీరాలకు చేరింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, రింకూ సింగ్ చెరో వికెట్ మాత్రమే తీశారు. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ హీరో టోనీ డి జోర్జికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

అంతకుముందు దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ధాటికి భారత్‌ బ్యాటర్లు తేలిపోయారు. 46.2 ఓవర్లలో 211 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ (62), కెప్టెన్ రాహుల్ (56) అర్ధశతకాలతో రాణించినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4), తిలక్ వర్మ (10), సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (17), అక్షర్ పటేల్ (7) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. సఫారీ బౌలర్లలో నాండ్రే బర్గర్ 3, బ్యూరాన్ హెండ్రిక్స్ 2, కేశవ్ మహరాజ్ 2, లిజాద్ విలియమ్స్ 1, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 1 వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా విజయంతో 3 వన్డేల సిరీస్ 1-1తో సమానమైంది. దీంతో చివరి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను ఖాతాలో వేసుకోనుంది.
Tony De Zorzi Century
India vs South africa
2nd ODI
Cricket
Team India

More Telugu News