రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే.. ఆయనే సీఎం కావాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషకరమన్న జేసీ
  • కాంగ్రెస్, టీడీపీలు మిత్ర పక్షాలే అని వ్యాఖ్య
  • వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుస్తుందని ధీమా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటం సంతోషించదగ్గ విషయమని ఏపీ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడేనని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ మిత్ర పక్షాలేనని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయితేనే బాగుంటుందని... రాష్ట్ర విభజన అనంతరం పంపకాల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని... చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని జేసీ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో గురువు చంద్రబాబు, తెలంగాణలో శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంలుగా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉండటం సహజమని అన్నారు. ఏపీలో మంచి పాలన అందించే సత్తా కేవలం చంద్రబాబుకే ఉందని చెప్పారు.


More Telugu News

JC Prabhakar Reddy Chandrababu Telugudesam Revanth Reddy Congress