Advertisement

బీఆర్ఎస్ తప్పులపై 100 అంశాలతో బీజేపీ ఛార్జ్ షీట్!

Muralidhar Rao About Chargesheet Against BRS
  • ఛార్జ్ షీట్‌ను విడుదల చేసిన మురళీధరరావు
  • అవినీతి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగడం లేదని విమర్శ
  • బీఆర్ఎస్ అంటేనే అవినీతి అని వ్యాఖ్య 
  • దళిత ముఖ్యమంత్రి నుంచి దళితబంధు వరకు అబద్ధపు హామీలేనని మండిపాటు
అవినీతి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగడంలేదని బీజేపీ చార్జ్‌షీట్ కమిటీ చైర్మన్ మురళీధరరావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు అంటూ ఆయన 100 అంశాలతో ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ... భగవంతుడు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడుకి చెప్పినట్లుగా తెలంగాణలో అవినీతిలేని చోటు లేదన్నారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి అన్నారు. ఎన్నికలకు ముందు భగవంతుడే తీసుకువచ్చాడా? అన్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపం బయటపడిందన్నారు. అవినీతి విషయంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు.

నీటి పారుదల, పేపర్ లీకేజీలు, రైతు బంధు సహా రైతుల అంశాలు... ఇలా ఎన్నోచోట్ల అవినీతి జరిగిందన్నారు. అందుకే తమ చార్జ్ షీట్‌లో ఈ అంశాన్నింటిని ప్రస్తావించామన్నారు. దేశంలో అవినీతికి ఉదాహరణగా తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చునన్నారు. అవినీతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడవడం లేదన్నారు. రుణమాఫీ వడ్డీలకే సరిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఒక్కటీ ఏర్పాటు చేయలేదన్నారు. దళిత ముఖ్యమంత్రి మొదలు దళితబంధు వరకు అన్నీ అబద్ధపు హామీలే ఇచ్చారన్నారు.

2014, 2018 మేనిఫెస్టో, ప్రజల మధ్య, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నప్పటికీ సౌకర్యాలు లేవన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలతో పాటు కారుణ్య నియామకాలు చేపడుతామని చెప్పి, విస్మరించారన్నారు. సింగరేణిలో నిమ్స్ ఏర్పాటు చేస్తామని చేయలేదన్నారు. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తానని ఆ పని చేయలేదన్నారు. కేంద్రం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయడం లేదన్నారు.
Advertisement
muralidhar rao
BJP
KCR
BRS
Telangana Assembly Election

More Telugu News