గర్భిణిలకు ఈ 3 పరీక్షలు తప్పనిసరి అంటున్న వైద్యులు!
- అల్ట్రాసౌండ్ పరీక్షలతో పిండం ఎదుగుదల తెలుసుకోవచ్చట
- రక్త పరీక్షలతో హెపటైటిస్ వ్యాధుల గురించి ఆరా
- మధుమేహాన్ని చెక్ చేయడానికి రెండుసార్లు గ్లూకోజ్ ఛాలెంజ్ పరీక్ష
క్రమం తప్పకుండా రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ పరీక్షలతో పాటు మధుమేహ పరీక్షను రెండుసార్లు చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. రక్త పరీక్షల ద్వారా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, థైరాయిడ్ తదితర సమస్యలను గుర్తించవచ్చని అన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యం గురించిన ముఖ్యమైన సమాచారం అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారానే తెలుస్తుందని వివరించారు.
తొలి త్రైమాసికంలో నిర్వహించే అల్ట్రాసౌండ్ పరీక్షతో పిండం ఎదుగుదల, ప్లాసెంటా స్థానం, అమ్నియోటిక్ ద్రవం స్థాయుల అంచనా.. తదితర విషయాలను వైద్యులు తెలుసుకుంటారు. రెండో త్రైమాసికంలో లెవల్ 2 అల్ట్రాసౌండ్ పరీక్షతో పిండం పెరుగుదలలో సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందట. ఇక మూడో, చివరి త్రైమాసికంలో (లెవల్ 3) జరిపే అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా పిండం అవయవాల అభివృద్ధి, శరీర నిర్మాణాన్ని అంచనా వేసే వీలుంటుందని వైద్యులు చెప్పారు.