మేం ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం.. అందుకే పార్లమెంట్‌కు రాలేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పార్లమెంట్ సమావేశాలకు వస్తున్నప్పుడు ఢిల్లీ ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం వల్లే మహిళా బిల్లు ఓటింగ్ సమయంలో సభలో ఉండలేకపోయామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ లో కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనలేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగారు. దీనిపై కోమటిరెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేందుకు తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. స్వయంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు.

మహిళా బిల్లు పాస్ అయ్యేటప్పుడు 66 మంది బీజేపీ ఎంపీలు కూడా లేరని, వాళ్లెందుకు హాజరుకాలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని ముందు నుంచి కోరుతున్నది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లు అంటూ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను బీజేపీ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయని కిషన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై, తమపై విమర్శలు చేసే నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు.

Komatireddy Venkat Reddy
Loksabha
womens reservation bill
voting
G. Kishan Reddy
BJP
Congress
BRS
New Delhi

More Telugu News