2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాం.. జగన్ కు 6 నెలలే మిగిలి ఉంది: పవన్ కల్యాణ్

  • జనసేన, టీడీపీతో బీజేపీ కూడా కలిసి వస్తుందనే భావిస్తున్నానన్న పవన్ 
  • చంద్రబాబు వంటి వ్యక్తి జైల్లో ఉండటం అందరూ సిగ్గు పడాల్సిన విషయమని వ్యాఖ్య
  • తప్పు చేసిన వైసీపీ నేతలను ఉపేక్షించబోమని హెచ్చరిక
టీడీపీ అధినేత చంద్రబాబుతో ఈరోజు జరిగిన ములాఖత్ ఆంధ్రపద్రేశ్ కు చాలా అవసరమని జనసేనాని పవన్ చెప్పారు. తాను ఎన్డీయేలో ఉన్నానని, అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని... ఇదే విషయాన్ని బీజేపీ హైకమాండ్ కు కూడా చెప్పానని, వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేనది తనకు తెలియదని చెప్పారు. ఈరోజు తాను ఒక విషయాన్ని అందరికీ స్పష్టంగా చెపుతున్నానని, 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ రెండూ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నానని అన్నారు. ఇప్పటి వరకు పొత్తుల గురించి ఆలోచన మాత్రమే చేశానని, ఇప్పుడే పొత్తుపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ అరాచకాలను అడ్డుకోలేమని అన్నారు. జగన్ కు ఇక మిగిలింది కేవలం 6 నెలలు మాత్రమేనని చెప్పారు. ఈ నిర్ణయం ఈ రెండు పార్టీల మేలు కోసం తీసుకున్నదని కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్నదని చెప్పారు. 

బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి వారిని రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, సైబరాబాద్ వంటి సిటీని నిర్మించిన వ్యక్తి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం అందరూ చాలా సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. పోలీసులపై తనకు ఎంతో గౌరవం ఉందని... కానీ పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. జగన్ ను నమ్ముకున్న వైసీపీ నేతలందరికీ ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నానని... చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. 6 నెలల తర్వాత టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. మీరు యుద్ధమే కోరుకుంటే... యుద్ధానికి తాము సిద్ధమని చెప్పారు.


More Telugu News

Pawan Kalyan Janasena Chandrababu Telugudesam