బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఓ తండ్రి కష్టం.. మన్యం జిల్లాలో ఘటన!

  • మన్యం జిల్లా రెబ్బ గ్రామంలో అనారోగ్యానికి గురైన ఏడేళ్ల చిన్నారి
  • తెప్పపై నాగావళి నదిని దాటుకుని వెళ్లిన కుటుంబ సభ్యులు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపేంత సాంకేతికత ఉన్న మన దేశంలో.. ఎన్నో చోట్ల ఆసుపత్రులకు వెళ్లేందుకు రోడ్లు కూడా లేవు. ఇప్పటికీ చాలా మారుమూల ప్రాంతాల్లో వాగులు, వంకలను దాటాలంటే చిన్నపాటి పడవలు, తెప్పలే దిక్కు. మన్యం జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ.

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం చొల్లపథం పంచాయతీ పరిధిలోని రెబ్బ గ్రామంలో ఏడేళ్ల చిన్నారి అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి వెళ్లాలంటే రోడ్డులేదు. నాగావళి నదిని దాటుకుని వెళ్లాలి. దీంతో కొందరు యువకులు వెదురు బొంగులతో తెప్పను తయారు చేశారు. దాంతో ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ నదిని దాటారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో బాలికను ఒడిలో పెట్టుకుని తండ్రి, పక్కన తల్లి కూర్చోగా.. మిగతా వాళ్లు నలువైపులా ఉండి.. నదిని దాటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


More Telugu News

Manyam district Nagavali river bamboo carrier to cross river