Advertisement

ఏపీని అప్పుల పాలు చేస్తోంది.. వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి ఫైర్

BJP AP chief Purandheswari fires on YS Jagan Govt
  • నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆరోపణ
  • రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులు అందజేస్తోందన్న బీజేపీ ఏపీ చీఫ్
  • పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 42 శాతం తిరిగిస్తున్నట్లు వెల్లడి
జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి మండిపడ్డారు. అధికారికంగా చేసే అప్పులకు తోడు అనధికారిక మార్గాల ద్వారా కూడా భారీ మొత్తంలో అప్పులు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పురందేశ్వరి మాట్లాడారు. మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని పూచికత్తుగా చూపి రూ.8 వేల కోట్లకు పైగా ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిందని చెప్పారు.

ఇలా వివిధ మార్గాలలో నాలుగేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రూ.4,74,315 కోట్ల అప్పులు చేసిందన్నారు. ఈ మొత్తానికి రిజర్వ్ బ్యాంకు నుంచి అధికారికంగా తీసుకున్న అప్పులు అదనమని చెప్పారు. ఈ అప్పులకు వడ్డీ రూపంలో రూ.50 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని వివరించారు. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 40 శాతం వడ్డీలు చెల్లించడానికే ఖర్చు చేయాల్సి వస్తే ఇక రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా చేయగలరని ఆమె ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను జగన్ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రం సేకరించి పంపే పన్నుల ఆదాయంలో 42 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాలలో తిరిగిచ్చేస్తోందని చెప్పారు. యూపీఏ పాలనలో కేవలం 32 శాతం ఆదాయమే రాష్ట్రాలకు తిరిగివచ్చేదని ఆమె గుర్తుచేశారు. కాగా, జగన్ సర్కారు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అప్పులు చేస్తోందని మండిపడ్డారు.

కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో పెడుతూ వారిని ఇబ్బంది పెడుతోందని, కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారని పురందేశ్వరి చెప్పారు. దీనిని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు.
Advertisement
BJP
Andhra Pradesh
Daggubati Purandeswari
YSRCP
Jagan govt

More Telugu News