గర్భవతిగా ఉన్నప్పుడు ఉపాసన తీసుకున్న జాగ్రత్తలే కాన్పు సాఫీగా జరగడానికి కారణం: అపోలో డాక్టర్ల బృందం

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఉపాసన పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. దీనిపై అపోలో డాక్టర్ల బృందం స్పందించింది. ఉపాసన కాన్పు సందర్భంగా వైద్య సేవలు అందించిన డాక్టర్ సుమన మనోహర్, డాక్టర్ రూమా సిన్హా, డాక్టర్ లత కంచి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. 

ఈ ఉదయం ఉపాసనకు డెలివరీ చేశామని, తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. వారు త్వరలోనే ఇంటికి వెళతారని డాక్టర్లు తెలిపారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఉపాసన ఫిట్ నెస్ పరంగా, న్యూట్రిషన్ పరంగా అద్భుతమైన జాగ్రత్తలు తీసుకున్నారని, అందుకే కాన్పు సాఫీగా జరిగిందని వివరించారు. అందరు గర్భవతులు ఉపాసనలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపాసన, పాపకు సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ సుమన మనోహర్ తెలిపారు. 

అటు, మెగాస్టార్ చిరంజీవి అపోలో ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ, మనవరాలు జన్మించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.49 (మంగళవారం) గంటలకు ఉపాసన ఆడశిశువుకు జన్మనిచ్చిందని వెల్లడించారు. 

"రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఓ బిడ్డ పుట్టాలి, ఆ బిడ్డను మా చేతుల్లో పెట్టాలి అని ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నాం. భగవంతుడి దయ వల్ల, అందరి ఆశీస్సులతో అది ఇన్నాళ్లకు నెరవేరింది" అని చిరంజీవి సంతోషంగా చెప్పారు.

Upasana
Baby
Apollo Doctors
Hyderabad
Ramcharan
Chiranjeevi
Mega
Tollywood

More Telugu News