మండలానికి రూ. 5 లక్షలు ఇచ్చి.. నా దిష్టిబొమ్మను తగలబెట్టిస్తున్నారు: ఎమ్మెల్యే మేకపాటి

  • పార్టీ తనకు ద్రోహం చేసిందన్న మేకపాటి చంద్రశేఖరరెడ్డి
  • ఇలాంటి గౌరవం దక్కడం తన కర్మ అంటూ చెంపలు వాయించుకున్న ఎమ్మెల్యే
  • డబ్బులు సంపాదించిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టీకరణ
  • వైఎస్ కుమారుడనే జగన్‌కు అండగా నిలిచానన్న మేకపాటి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మర్రిపాడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కుమారుడని మొదటి నుంచి జగన్‌కు అండగా నిలిచినందుకు మోసపోయానని అన్నారు. తనకు ఇలాంటి గౌరవం దక్కడం తన కర్మ అంటూ చెంపలు వాయించుకున్నారు. పార్టీ తనకు ద్రోహం చేసిందని ఆరోపించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఎవరి వద్దా చిల్లిగవ్వ కూడా తీసుకోలేదన్న ఆయన.. తాను డబ్బులు సంపాదించిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన నియోజకవర్గంలో ధనవంతులకే టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే జగన్, సజ్జల తనను అవమానపరుస్తున్నారని విమర్శించారు. సజ్జల తన నియోజకవర్గంలో ఒక్కో మండలానికి రూ. 5 లక్షల చొప్పున ఇచ్చి తన దిష్టిబొమ్మను దహనం చేయిస్తున్నారని ఆరోపించారు. తనను ఇలా హింసిస్తారని ఊహించి ఉంటే ముందు నుంచే వీళ్లకు దూరంగా ఉండేవాడినని మేకపాటి అన్నారు.

Mekapati Chandra Sekhar Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News