పిఠాపురం వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వర్మ తీరుపై అసంతృప్తి!

Chandrababu Dissatisfaction With SVSN Varma Conduct In Pithapuram Protocol Dispute Reports Said
  • పిఠాపురంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం
  • టీడీపీ నేత వర్మ తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి
  • టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లాకు ఫోన్ చేసి కీలక ఆదేశాలు
  • బహిరంగ గొడవలు సరికాదని, క్రమశిక్షణ ముఖ్యమని హితవు
  • వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగిన అధిష్ఠానం
కాకినాడ జిల్లా పిఠాపురంలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన నేతల మధ్య చెలరేగిన ప్రోటోకాల్ వివాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కారణంతో మొదలైన ఈ గొడవ, తోపులాట వరకు దారితీయడంపై ఆయన సీరియస్‌గా స్పందించారు. ఇలాంటి ఘటనలు కూటమికి నష్టం కలిగిస్తాయని, పునరావృతం కాకుండా చూడాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే... మంగళవారం పిఠాపురంలో జరిగిన 'పాడా' (పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) సమావేశం సందర్భంగా ఈ వివాదం రాజుకుంది. కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో లేకపోవడంపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో జనసేన నేత పెండెం దొరబాబు కలుగజేసుకోవడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలై, తోపులాటకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి శ్రేణుల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయం తన దృష్టికి రావడంతో సీఎం చంద్రబాబు వెంటనే స్పందించినట్లు సమాచారం. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి, పిఠాపురం ఘటనపై ఆరా తీశారు. ముఖ్యంగా టీడీపీ నేత వర్మ ప్రవర్తించిన తీరును ఆయన తప్పుబట్టినట్టు తెలిసింది. ఫొటోలు, ప్రోటోకాల్ వంటి చిన్న విషయాల కోసం బహిరంగంగా ఘర్షణలకు దిగడం సరికాదని హితవు పలికినట్టు సమాచారం. ఏవైనా సమస్యలు, పొరపాట్లు ఉంటే వాటిని పార్టీ అధిష్ఠానం లేదా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావాలని, అంతేకానీ వీధుల్లో గొడవపడటం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వంలో పార్టీల మధ్య అంతర్గత క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని చంద్రబాబు నొక్కిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎస్వీఎస్ఎన్ వర్మకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని పల్లా శ్రీనివాసరావును ఆయన ఆదేశించారు. మరోవైపు ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీంతో వివాదం మరింత ముదరకముందే దానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో అధిష్ఠానం రంగంలోకి దిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Go Back to Shorts
Chandrababu
SVSN Varma
Pithapuram
Andhra Pradesh

More Telugu News