Chandrababu: ఎన్నికలు అపహాస్యమవుతుంటే చర్యలు తీసుకోకపోవడం దారుణం: చంద్రబాబు

Chandrababu reviews on MLC elections
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల తీరుపై టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నేతలతో మాట్లాడుతున్నారు. పోలింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయని, వైసీపీ దౌర్జన్యాలకు దిగుతోందని, పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పార్టీ నేతలు ఆయనకు వివరించారు. 

దీంతో ఉదయం నుంచి జరుగుతున్న ఘటనలపై ఉన్నతాధికారులకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కడప ఎస్పీ, తిరుపతి జిల్లా ఎస్సీలతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. ఉదయం నుంచి జరిగిన ఘటనలు అధికారులకు వివరించి, తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికలు ఇంత స్థాయిలో అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు. బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉందని ఆరోపించారు. 

పట్టభద్రులు ఓటువేయాల్సిన ఎన్నికల్లో అనర్హులతో, నిరక్షరాస్యులతో బోగస్ ఓట్లు వేయిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ పక్షాల ఫిర్యాదులను ఎన్నికల అధికారులు సీరియస్ గా తీసుకోవాలని కోరారు. తిరుపతిలో బోగస్ ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సమీక్షలో టీడీపీ ముఖ్యనేతలు యనమల, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, టీడీ జనార్ధన్ తదితర నేతలు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu
MLC elections
graduate mlc elections
TDP

More Telugu News