జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి... మార్పు అంటే ఏంటో చూపిస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan appeals people for one chance
  • విజయనగరం జిల్లాలో పవన్ పర్యటన
  • గుంకలాంలో జగనన్న కాలనీ సందర్శన
  • ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జనసేనాని
  • మెరుగైన భవిష్యత్ కోసం జనసేనపై నమ్మకం ఉంచాలని పిలుపు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మెరుగైన భవిష్యత్ కోసం జనసేనపై నమ్మకం ఉంచాలని, మార్పు అంటే ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు.

 తనపై నమ్మకం ఉంచితే గూండాలతో అయినా పోరాడతానని పవన్ ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర జనసైనికులు కేసులకు భయపడొద్దని, కేసులు పెడితే తాను కూడా వస్తానని అన్నారు. రాజధాని పేరిట వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వంచనను ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా తెలుసుకోవాలని, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి బలమైన రాజకీయ అధికారం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

అవినీతిపై రాజకీయ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. యువతీయువకులు తమ శక్తిని అవినీతి రహిత సమాజం ఏర్పాటు కోసం ఉపయోగించాలని అన్నారు. 

కాగా, విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం లభించింది. విశాఖ-విజయనగరం మార్గంలో ఆనందపురం సెంటర్ వద్ద పవన్ ను గజమాలతో సత్కరించారు. 

గుంకలాంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీ రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద కాలనీ. 397 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఇక్కడ ఇళ్ల నిర్మాణం సరిగా సాగడంలేదని జనసేన ఆరోపిస్తోంది.
Go Back to Shorts
Pawan Kalyan
Gunkalam
Vijayanagaram District
Janasena
Andhra Pradesh

More Telugu News