Andhra Pradesh: ఏపీలో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది: ఐఎండీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వివరించింది. 

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాయలసీమలో విస్తృతంగా, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. 

అటు, ఎగువన కురుస్తున్న వర్షాలతో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 4.15 లక్షల క్యూసెక్కులు కాగా, 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజి నుంచి 4.01 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Andhra Pradesh
Rains
Low Pressure
IMD
Bay Of Bengal

More Telugu News