రిషికొండ పర్యాటక ప్రాజక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం.. ఎన్జీటీ తీరుపై సుప్రీం విస్మయం
- రిషికొండ టూరిజం ప్రాజెక్టుపై ఎన్జీటీని ఆశ్రయించిన రఘురామకృష్ణ రాజు
- ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ ఎన్జీటీ ఆదేశాలు
- ఎన్జీటీ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
- ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- విచారణ బుధవారానికి వాయిదా
ఈ కేసు వివరాల్లోకి వెళితే... రిషికొండ పరిధిలో నూతన పర్యాటక ప్రాజెక్టు పనులను చేపడుతున్న సంస్థ నిబంధనలు పాటించడం లేదంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఎన్జీటీ... సదరు పనులను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్జీటీ ఇచ్చిన ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మంగళవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదేమిటి?.. పార్లమెంటు సభ్యుల లేఖలను కూడా జాతీయ హరిత ధర్మాసనం విచారిస్తోందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించలేని వారి కోసమే ఉన్నామన్నట్లుగా ఎన్జీటీ వ్యవహార సరళి ఉందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అది ఉన్నది సాధారణ పౌరులకే కానీ చట్ట సభ్యులకు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా ఎన్జీటీ తీర్పు కాపీ ఉందా? అని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింగ్విని కోర్టు అడగగా... అందుకోసం సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఈ పిటిషన్ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.