చైనాను షేక్ చేస్తున్న కరోనా... లాక్ డౌన్ లో 21 కోట్ల మంది ప్రజలు!

26 cities of China are under lockdown
  • షాంఘైలో కరోనా కారణంగా 20 మంది మృతి
  • లాక్ డౌన్ లో ఉన్న 26 నగరాలు
  • చైనా జీడీపీపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా
చైనాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. నాలుగో వేవ్ వస్తుందేమోనని ఆ దేశ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఆ దేశంలో కొత్తగా మరో 6,074 కేసులు నమోదయ్యాయి. కరోనా నిర్ధారణ అయిన వారిలో 384 మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించగా... మిగిలిన వారిలో అసింప్టొమేటిక్ లక్షణాలు ఉండటం గమనార్హం. అయితే ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 

మరోవైపు కరోనా కారణంగా 20 మంది చనిపోగా... మృతులందరూ కూడా షాంఘై ఫైనాన్షియల్ హబ్ కు చెందిన వారే కావడం గమనార్హం. ఇంకో దయనీయమైన పరిస్థితి ఏమిటంటే, షాంఘైలోని 2.6 కోట్ల మంది ప్రజలు నెలకు పైగా ఇళ్లకే పరిమితమయ్యారు. 

ఒక రిపోర్ట్ ప్రకారం చైనాలోని 26 నగరాలకు చెందిన దాదాపు 21 కోట్ల మంది సంపూర్ణ లేదా పాక్షిక లాక్ డౌన్ లో ఉన్నారు. మరో విషయం ఏమిటంటే.. చైనా మొత్తం జీడీపీలో 22 శాతాన్ని ఈ 26 నగరాలు అందిస్తున్నాయి. కరోనా కారణంగా చైనా జీడీపీ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. చైనాలో ఇప్పటి వరకు 2,17,836 కరోనా కేసులు నమోదు కాగా... 5,112 మంది మృతి చెందారు.
Go Back to Shorts
China
Corona Virus
Lockdown

More Telugu News