మామిడి పండ్లు అందరూ తినొచ్చా?.. పోషకాహార నిపుణులు ఏమంటున్నారు?
- గ్లూకోజ్, యూరిక్ యాసిడ్ పెరిగిపోతాయి
- ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వారికీ ఇబ్బందే
- పరిమితంగా తీసుకోవడమే మంచిదంటున్న నిపుణులు
పోషకాహార నిపుణులు చెబుతున్నదాని ప్రకారం చూస్తే.. మామిడి పండ్లను వేసవిలో తీసుకునే వారు తమ ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలి. మామిడి పండ్లు తియ్యగా ఉంటాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోతాయి. కనుక మధుమేహం తదితర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారు మామిడి పండ్లను ఎక్కువగా తీసుకోకూడదు.
మధుమేహం, యూరిక్ యాసిడ్, ట్రైగ్లిజరైడ్స్, అధిక బరువు ఉన్న వారు మామిడి పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ తీసుకోకుండా నియంత్రించుకోవాలి. పైగా మన దేశంలో నాన్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కేసులు ఎక్కువ. కార్బొహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏర్పడే సమస్య ఇది.
ఈ తరహా సమస్యలతో ఉన్న వారు మామిడి పండ్లను ఎక్కువగా తీసుకుంటే అందులోని ఫ్రక్టోస్ వల్ల రక్తంలోని గ్లూకోజ్, యూరిక్ యాసిడ్ పెరిగిపోతాయి. దీంతో కాలేయ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది పోషకాహార నిపుణుల సూచన. రోజువారీగా శారీరక వ్యాయామం చేస్తూ, బరువును అదుపులో పెట్టుకునే వారు, యాంటీ ఆక్సిడెంట్లను తగినంత తీసుకునే వారు మామిడి పండ్లను తీసుకోవచ్చు.