Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరో ఆటగాడికి కరోనా పాజిటివ్... నేడు జరగాల్సిన మ్యాచ్ పై నీలినీడలు!

ఐపీఎల్ తాజా సీజన్ ను కూడా కరోనా వైరస్ వెంటాడుతోంది. గత రెండు సీజన్లపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కలకలం రేపింది. ఈ జట్టులో మరో ఆటగాడికి కరోనా సోకింది. వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ టిమ్ సీఫెర్ట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో నేడు పంజాబ్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడాల్సిన మ్యాచ్ జరగడంపై నీలినీడలు అలముకున్నాయి. 

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఇప్పటికే ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ కు తొలుత కరోనా నిర్ధారణ కాగా, ఆపై మరికొన్ని కేసులు వెలుగుచూడడంతో జట్టులోని అందరికీ ఈ ఉదయం మరోసారి ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లను ఐసోలేషన్ లో ఉంచారు. 

ఐపీఎల్ నిబంధనల ప్రకారం కనీసం 12 మంది ఆటగాళ్లు (ఏడుగురు భారత ఆటగాళ్లతో కలిపి) అందుబాటులో ఉంటే చాలు... మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ కరోనా ప్రభావంతో కనీసం 12 మంది ఆటగాళ్లు కూడా అందుబాటులో లేకపోతే ఆ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసే వెసులుబాటు ఉంది. ఢిల్లీ జట్టులో కరోనా వ్యాప్తిపై నిశితంగా పరిశీలిస్తున్న బీసీసీఐ ఇప్పటికే నేటి మ్యాచ్ వేదికను పూణే నుంచి ముంబయికి మార్చింది.
Delhi Capitals
Corona Virus
Tim Seifert
Positive
IPL

More Telugu News