Andhra Pradesh: ఏపీ సీఎస్ పై ఆరోపణలు తగదు.. ఐఏఎస్ అధికారుల సంఘం ఖండన!

AP IAS officers association condemns employees comments on CS
  • ఏపీలో రచ్చరచ్చ అవుతున్న పీఆర్సీ వ్యవహారం
  • సీఎంను సీఎస్ పక్కదోవ పట్టిస్తున్నారన్న ఉద్యోగుల సంఘాలు
  • బాధ్యతారాహిత్యమైన ఆరోపణలన్న ఐఏఎస్ అధికారుల సంఘం
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అంశం రచ్చరచ్చ అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను సీఎస్ పక్కదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది.

సీఎస్ పై సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఐఏఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ చీఫ్  సెక్రటరీనే పరిపాలన అధిపతి అని ఆయన అన్నారు. అందరు ఉద్యోగులు, అన్ని ఉద్యోగ సంఘాల పట్ల సీఎస్ బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఇవి బాధ్యతారాహిత్యమైన ఆరోపణలని... భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని ఆశిస్తున్నట్టు చెప్పారు. వృత్తిపరంగా ఉన్నతాధికారులందరూ నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తారనే విషయాన్ని ఉద్యోగులు తెలుసుకోవాలని సూచించారు.
Andhra Pradesh
Chief Secretary
Employees Unions
IAS Officers Association

More Telugu News