అందుకే రోహిత్ శర్మ బాగా ఆడలేదు: టీమిండియా ఘోర ఓటమిపై సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలు
- రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మను వన్డౌన్లో దించారు
- మేనేజ్మెంట్ పొరపాటు చేసింది
- బౌల్ట్ను ఎదుర్కోలేవనే సంకేతాలు రోహిత్ శర్మకు ఇచ్చింది
- రోహిత్ శర్మ ఆటతీరుపై అతడికే అనుమానాలు కలిగాయి
టీమిండియా చేసిన పొరపాట్లే ఓటమికి కారణమయ్యాయని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విశ్లేషించారు. రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మను వన్డౌన్లో దించి మేనేజ్మెంట్ పొరపాటు చేసిందని అన్నారు. ఈ నిర్ణయం తీసుకుని బౌల్ట్ను ఎదుర్కోలేవనే సంకేతాలు రోహిత్ శర్మకు ఇచ్చినట్లయిందని ఆయన అన్నారు.
దీంతో రోహిత్ శర్మ ఆటతీరుపై అతడికే అనుమానాలు కలిగాయని అభిప్రాయపడ్డారు. అలాగే, ఇషాన్ కిషన్ను ఓపెనింగ్ స్థానంలో కాకుండా 4 లేక 5వ స్థానంలో దించితే బాగుండేదని తెలిపారు. పాక్తో జరిగిన మొదటి మ్యాచ్లో షాహిన్ అఫ్రిది బౌలింగ్లో రోహిత్ శర్మ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.
ఆ విషయాన్ని గుర్తించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తమ జట్టుతో మ్యాచ్ జరిగే ముందు పలు వ్యాఖ్యలు చేశాడు. పాక్ బౌలర్ షాహిన్ లాగే తాను కూడా యార్కర్లు వేసి టీమిండియాను ఇబ్బంది పెడతానని చెప్పాడు. ఇటువంటి సమయంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చడం చర్చనీయాంశమైంది.