తహసీల్దార్​ పై డీజిల్​ పోసిన రైతు

Farmer Pours Diesel On Tahsildar In Medak
  • మెదక్ జిల్లా శివ్వంపేటలో కలకలం
  • నిన్న కరెంట్ షాక్ తో రైతు మృతి
  • అతడికి పట్టా పుస్తకాలివ్వలేదని ఆరోపణ
  • రైతు బీమా రాదన్న ఆక్రోశంతో నిరసన
తహసీల్దార్ పై ఓ రైతు డీజిల్ పోయడం కలకలం రేపింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఈ ఘటన జరిగింది. నిన్న జిల్లాలోని తాళ్లపల్లి తండాలో మాలోత్ బాలు అనే రైతు పొలం వద్ద విద్యుదాఘాతంతో చనిపోయాడు. అయితే, శివ్వంపేట తహసీల్దార్ భాను ప్రకాశ్.. బాలుకు సకాలంలో పట్టాదార్ పాసుపుస్తకాలను ఇవ్వలేదని, దీంతో బాలుకు రైతు బీమా రాదని స్థానిక రైతులు ఆరోపించారు.

వారంతా కలిసి బాలు మృతదేహంతో శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. మృతదేహంతో ఆఫీసు ముందు ఆందోళన చేశారు. కొందరు రైతులు తమ వెంట డీజిల్ బాటిళ్లనూ తీసుకువచ్చారు. ఇంత ఆందోళన చేస్తున్నా తహసీల్దార్ పట్టించుకోవట్లేదని ఆక్రోశంతో ఆయనపై ఓ రైతు డీజిల్ పోశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆఫీసు దగ్గరకు వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

కాగా, రెండేళ్ల క్రితం రాష్ట్రంలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఓ రైతు నేరుగా ఆఫీసులోకి వెళ్లి ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో తీవ్రమైన కాలిన గాయాలతో ఆమె మరణించారు. ఆమెను కాపాడబోయిన డ్రైవర్ కూడా ఆ తర్వాత చనిపోయాడు. ఈ నేపథ్యంలోనే తాజా ఘటన కలకలం రేపింది.
Go Back to Shorts
Telangana
Farmer
Diesel
Tahsildar
MRO

More Telugu News