చిల్లర కేసులతో కోర్టు సమయం వృథా అవుతోంది: సుప్రీంకోర్టు
- లెక్కలేనంతగా చిల్లర కేసులు వస్తున్నాయి
- వీటివల్ల ప్రధాన కేసులకు సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం
- కోర్టు పని చేయలేని పరిస్థితి నెలకొంటోంది
వినియోగదారుల వివాదానికి సంబంధించిన ఓ కేసును జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈరోజు విచారించింది. వాస్తవానికి ఈ కేసును మార్చిలోనే కోర్టు ముగించింది. అయినప్పటికీ పిటిషనర్ మరో దరఖాస్తు ద్వారా కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ, ప్రాధాన్యం లేని కేసులు వచ్చి పడుతుండటం వల్ల... ప్రధానమైన కేసులకు న్యాయమూర్తులు తగినంత సమయాన్ని వెచ్చించలేకపోతున్నారని అన్నారు. కరోనాకు సంబంధించి కోర్టు జరుపుతున్న స్వీయ విచారణలో నిన్న తుది ఆదేశాలను ఇవ్వాల్సి ఉన్నప్పటికీ... తాను అలా చేయలేకపోయానని... ఈరోజు విచారణలకు సంబంధించిన ఫైల్స్ ను తాను చదవాల్సి వచ్చిందని చెప్పారు. మొత్తం కేసుల్లో 90 శాతం అల్పమైన కేసులే ఉంటున్నాయని అన్నారు. అల్పమైన కేసుల కోసం కోర్టు సమయం వృథా అవుతోందని చెప్పారు.