Visakhapatnam District: సింహాచలం ట్రాన్స్‌కో సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సింహాచలంలోని ట్రాన్స్‌కో విద్యుత్ సబ్‌స్టేషన్‌లో 10/16 ట్రాన్స్‌ఫార్మర్ ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన సబ్‌స్టేషన్ సిబ్బంది మంటలు మిగతా ట్రాన్స్‌ఫార్మర్లకు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

దాదాపు గంటన్నరపాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్ ఎస్ఈ సూర్యప్రతాప్ మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని, దీనిపైన, నష్టం అంచనాపైనా అధికారుల బృందం దర్యాప్తు చేస్తుందన్నారు. కాగా, ప్రమాదానికి గురైన ట్రాన్స్‌ఫార్మర్ 25 ఏళ్లనాటిదని అధికారులు తెలిపారు.
Visakhapatnam District
Simhachalam
Sub Station
Fire Accident

More Telugu News