సీక్వెల్ దిశగా 'జాతిరత్నాలు'

Jathirathnalu Sequel
  • చిన్నసినిమాగా వచ్చిన 'జాతిరత్నాలు'
  • పెద్ద హిట్ తో భారీ వసూళ్లు
  • సీక్వెల్ పనుల్లో దర్శక నిర్మాతలు
ఈ మధ్య కాలంలో ఎక్కువమంది నోళ్లలో నానిన పేరు 'జాతిరత్నాలు. స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకి అనుదీప్ దర్శకత్వం వహించాడు. నవీన్ పోలిశెట్టి .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ద్వారా, ఫారియా అబ్దుల్లా కథానాయికగా పరిచయమైంది.

మార్చి 11వ తేదీన విడుదలైన ఈ సినిమా, విడుదలైన ప్రతిప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా థియేటర్లకు వచ్చి, పెద్ద విజయంతో తిరిగి వెళ్లింది. ఈ సినిమా కోసం చేసిన ఖర్చు .. రాబట్టిన వసూళ్లు చూసుకుంటే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అనే అనుకోవాలి.

అలాంటి ఈ సినిమా సీక్వెల్ దిశగా అడుగులు వేయనున్నట్టుగా తెలుస్తోంది. దర్శకనిర్మాతలు సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ లైన్ కూడా ఆలోచించి పెట్టుకున్నారట. మొదటిభాగంలో ముగ్గురు యువకులు బ్రతకడం కోసం పల్లెటూరి నుంచి హైదరాబాద్ వస్తారు. అక్కడ వారు పడే అవస్థలతో కథ ఫన్నీగా సాగిపోతుంది.

ఇక సీక్వెల్లో ఈ ముగ్గురూ తమ కలలు నిజం చేసుకోవడం కోసం అమెరికా పోతారట. అక్కడ వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే కథ. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
Naveen Polishetty
Priyadarshi
Rahul Ramakrishna
Fariya Abdulah

More Telugu News