Varla Ramaiah: వివేకా హత్య కేసులో జగన్ ఇరుక్కునే అవకాశం ఉంది... అందుకే చంద్రబాబుకు నోటీసులు: వర్ల రామయ్య

అమరావతి భూముల అంశంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు పంపడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని, హాజరుకాకపోతే అరెస్ట్ తప్పదని సీఐడీ చంద్రబాబును హెచ్చరించడాన్ని వర్ల రామయ్య తీవ్రంగా ఆక్షేపించారు. పాలన చేపట్టిన రెండేళ్ల తర్వాత కళ్లు తెరిచి ఇప్పుడు నోటీసులు ఇస్తారా? అని మండిపడ్డారు.

త్వరలోనే జగన్, విజయసాయి బెయిళ్లు రద్దు కాబోతున్నాయని అన్నారు. సీఎం జగన్ వెన్నులో వణుకు పుట్టించే పనిలో సీబీఐ ఉందని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిని త్వరలోనే పట్టుకుంటారని, ఈ కేసులో జగన్ ఇరుక్కునే అవకాశం ఉందని వర్ల వివరించారు. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబుకు సీఐడీ ద్వారా నోటీసులు పంపారని ఆరోపించారు.

ఇడుపులపాయలో దళితులకు అన్యాయం చేసింది మీ కుటుంబమే అంటూ సీఎం జగన్ ను విమర్శించారు. అసైన్డ్ భూములను అధీనంలోకి తీసుకున్నది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. 690 ఎకరాల దళితుల భూములను సాగుచేశామని నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంగీకరించారని వెల్లడించారు.
Varla Ramaiah
CID Notice
Chandrababu
YS Vivekananda Reddy
Jagan
CBI
Andhra Pradesh

More Telugu News