Team India: టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకిన టీమిండియా

చెన్నైలో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి దూసుకెళ్లింది. చెన్నైలో ఇంగ్లండ్ పై గెలిచి 4 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసిన కోహ్లీ సేన వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి పడిపోయింది.

కాగా, టెస్టు చాంపియన్ షిప్ జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. మరో బెర్తు కోసం భారత్, ఇంగ్లండ్ మధ్య గట్టిపోటీ నెలకొంది. భారత్ జట్టు ఈ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే సిరీస్ లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ కు కూడా ఇదే సమీకరణం వర్తిస్తుంది.

ఈ సిరీస్ ను టీమిండియా గానీ, ఇంగ్లండ్ గానీ 3-1 తేడాతో గెలిస్తే, గెలిచిన జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడుతుంది. అలా కాకుండా 2-2తో గానీ, 1-1తో గానీ సిరీస్ సమం అయినా, 2-1తో ఇంగ్లండ్ గెలిచినా... భారత్, ఇంగ్లండ్ జట్లలో ఏ ఒక్కటీ ఫైనల్ చేరకపోగా.... ఫైనల్లో న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా ఆడుతుంది.
Team India
WTC
ICC
Points Table
England
New Zealand
Australia
Finals
Cricket

More Telugu News