పది మందిని సమాధి చేసిన హిమపాతం, హిమనీనదాలు

10 climbers died due to avalanche
  • ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఉన్న అల్బోర్జ్ పర్వత శ్రేణుల్లో ప్రమాదం
  • మరో ఏడుగురు గల్లంతు.. 14 మందిని కాపాడిన సహాయ సిబ్బంది
  • వాతావరణం బాగాలేదని ముందే హెచ్చరించామంటున్న అధికారులు
చుట్టూ తెల్లని మంచు కొండలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇంతకంటే మంచి సమయం దొరుకుతుందా అనుకున్నారు ఆ పర్వతారోహకులు. వందలాది మంది సాహసానికి బయల్దేరారు. కానీ, మధ్యలో వాతావరణం తేడా కొట్టింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న తెల్లటి కొండలు.. ఊహించని విధంగా కన్నెర్రజేశాయి. హిమపాతాలు, హిమనీనదాలతో ముంచెత్తాయి. పది మందిని సమాధి చేశాయి. ఈ ఘటన ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని అల్బోర్జ్ పర్వత శ్రేణిలో శనివారం జరిగింది.

ప్రమాదంలో మరో ఏడుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారి కోసం సహాయ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ చర్యల కోసం రెడ్ క్రెసెంట్ 20 బృందాలను రంగంలోకి దింపింది. వారు 14 మంది పర్వతారోహకులను కాపాడారు. శనివారం రాత్రి కావడంతో గల్లంతైన వారి గాలింపునకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆదివారం ఉదయం మళ్లీ గాలింపును మొదలుపెట్టనున్నారు. కాగా, శుక్రవారం కేబుల్ కార్ పాడైపోవడంతో దాదాపు వంద మంది దాకా ఎత్తైన కొండల్లో చిక్కుకుపోయినట్టు అధికారులు చెప్పారు. వారిని కాపాడినట్టు చెప్పారు.

అయితే, వాతావరణ పరిస్థితులు బాగాలేవని ముందు నుంచే హెచ్చరిస్తున్నట్టు అధికారులు చెప్పారు. పర్వతారోహకులు తీసుకెళ్లిన జీపీఎస్ వ్యవస్థలు సరిగ్గా పనిచేసి ఉండకపోవచ్చని, దీంతో వాళ్లు పర్వతాధిరోహణకు ముందుకు కదిలి ఉంటారని అధికారులు చెప్పారు.
Go Back to Shorts
Avalanche
Iran
Tehran
Alborz Mountain

More Telugu News