Anil Kumar Yadav: చంద్రబాబు వల్ల హైదరాబాదులో కూడా వరదలు వచ్చాయి: అనిల్ కుమార్ యాదవ్

Hyderabad floods are because of Chandrababu says Anil Kumar Yadav
  • శ్రీశైలం ప్రాజెక్టును కూడా చంద్రబాబు ముంచేశారు 
  • రాష్ట్రానికి పర్యాటకుల మాదిరి వచ్చిపోతున్నారు
  • తుంగభద్ర పుష్కరాలకు రూ. 210 కోట్లు విడుదల చేశాం
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కరకట్టపై నిర్మించిన అక్రమ నివాసాన్ని ఖాళీ చేసి పోవాలని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వరదల సమయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చంద్రబాబు అంటున్నారని... కరకట్ట మీద అక్రమంగా ఉంటున్నవారు ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. రాష్ట్రానికి చంద్రబాబు, నారా లోకేశ్ పర్యాటకుల మాదిరి వచ్చిపోతున్నారని అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు హయాంలో ఎప్పుడూ సరైన వర్షాలు కురవలేదని... గత ప్రభుత్వ హయాంలో మాత్రం తుపాన్లు వచ్చి ప్రజలు నష్టపోయారని అనిల్ విమర్శించారు. శ్రీశైలం పవర్ ప్రాజెక్టును కూడా వరద నీటితో ముంచేశారని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే హైదరాబాదుకు కూడా వరదలు వచ్చాయని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి దేవుడు కూడా సహకరిస్తున్నాడని చెప్పారు.

తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు రూ. 210 కోట్లు విడుదల చేశామని అనిల్ తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పుష్కరాలను నిర్వహిస్తామని చెప్పారు. రూ. 40 వేల కోట్లతో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు.
Anil Kumar Yadav
YSRCP
Chandrababu
Telugudesam
Tungabhadra Pushkaralu

More Telugu News